18, జూన్ 2012, సోమవారం

ఇంకొక ప్రేమ జంట ఆత్మహత్య, కారణమెవరు ?

పుట్టి భూమ్మీద పడగానే చిన్నారులకు సమాజం వల్ల బోలెడన్ని బాధ్యతలు వచ్చేస్తున్నాయి. అబ్బాయి ఉన్నాడు అంటే, వరసయ్యే  అమ్మాయిని భార్యగా పరిచయం చేస్తారు. ఆడపిల్ల తండ్రి కాస్త ఎక్కువ సంపన్నుడై,  అమ్మాయి కి రూపం చదువు అబ్బి ఉంటె అతనిపై రెట్టింపు బాధ్యత ఉంటుంది తగిన అల్లుడిగా తనను తను ప్రూవ్ చేసికోవడానికి.  ఏ అమెరికానో ఆస్ట్రేలియా నో వెళ్లి చదివి తిరిగొచ్చి అమ్మాయిని పెళ్లాడాలి. ఆ చిన్న మనసు ఎంత వత్తిడి తట్టుకోగలదు !!!


 సరే మామయ్య అల్లుడిని  తిరస్కరించాడు. అయితే జీవితం అక్కడితో ఆగిపోదు కదా. ఆశలు కలిపించమని తాను అడిగేడా, చిన్న తిరస్కారం అయినా తన ప్రపంచాన్ని మార్చెయ్యదా . ఆ బాధ అంతా పక్కింటి ఇంకో అమ్మాయి పై ప్రేమ గా మారింది, కాని కులాల మధ్య అంతరాలు ఆ అమాయక పెద్దల్ని మరొకసారి దోషుల్ని చేసింది. ఇద్దరు వెళ్లి పోయారు. చెయ్యని ప్రయత్మ లేదు ఆచూకి కోసం. కొద్దిగా తెలిసాయి కాని ఇరవై రోజులతరువాత గోవా నుండి కబురు, ఇద్దరు ఆత్మహత్య చేసికొన్నారు,  SIM Card ఆధారం గా అడ్రస్ ట్రేస్ చేసి తెలియపరుస్తున్నాము అనీను.



ఆంద్ర రాష్ట్రం నుండి గోవా దాకా వెళ్ళారా కలిసి జీవించలేని పరిస్థితుల్లో ఆత్మహత్య కోసం !! అందరికీ దూరం అవ్వలేని సున్నితత్వం, కలిసి ఎక్కడో ఒకచోట బ్రతుకలేని నిస్సహాయత .అయినా చేతులారా ప్రాణం ?  ఎలా ఆ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు.   ఆత్మ హత్య కావచ్చు ఇంకోసమస్య కావచ్చు, మానవ సంబందాలన్నే ఆర్దికసంబందాలన్న భావన సమాజం లో అంతర్లీనం గా పెనవేసుకుపోయింది. ఎక్కడ పొరపాటు జరిగిందీ తెలియని ఎందరో తల్లిదండ్రుల గుండెకోత కు సమాధానం ఎవరు వివరిస్తారు.  ఇంకొకరు ఇలా బలి కాకూడదు అని చిన్న ఆశ తో ఈ టపా. ఆ ఇద్దరి ఆత్మకు శాంతి కలగాలని !!!

14, జూన్ 2012, గురువారం

కాంగ్రెస్ జగన్ నే టార్గెట్ చేసిందా లేక ఓటర్లను టార్గెట్ చేసిందా ?



ప్రజాస్వామిక వాదులందరూ అడుగుతున్న ప్రశ్న!  ప్రభుత్వం కేవలం జగన్ యొక్క అవినీతిని మాత్రమె ఎందుకు నేరం  గా పరిగణిస్తున్నది ?  ప్రతిఒక్కరికి అవినీతిలో భాగస్వామ్యం ఉన్నది అని అంటున్నారు. అలాగే ప్రభుత్వానికి తెలుసు, జగన్ ని జైల్లో పెడితే సానుభూతి పెరిగి అతను రాజకీయంగా సక్సెస్ అవుతాడు అని. అయినా అతన్ని అరెస్టు చేసి విచారణ జరిపించడానికి కారణాలు ఏమిటి?

కాంగ్రెస్ కి కావలసినది 2014 లో మళ్ళి పార్టీ అధికారం లోకి రావడం, గెలుపు కు ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు జగన్ ని వదిలేస్తే పెద్దమొత్తం లో కాంగ్రెస్ ఓట్లు  చీల్చుకొంటాడు. జగన్ కు చెక్ పెట్టాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి  వల్ల లబ్ది పొందిన ప్రజలను ఎలాగు మార్చలేరు కాబట్టి, ఆయన వల్ల నష్టపోయిన ప్రజల మద్దతు సంపాదించడం ముఖ్యం. అటువంటి జీవో లు రద్దు చెయ్యాలి అంటే ముందు ఆ ప్రాజెక్టు కు సంబంధిత వ్యక్తులను అనర్హులు గా ప్రకటించాలి కాబట్టి వాన్ పిక్ కేసులో ముద్దాయిలంతా అరెస్టు చెయ్యబడ్డారు, జీవో రద్దవుతున్నది . అదేసమయం లో కాకరపల్లి, సోంపేట థర్మల్ ప్రాజెక్టులకు అనుమతుల్ని రద్దు చెయ్యడానికి మార్గం సుగమం అయ్యింది. ఈ రైతులంతా నేరం చేసిన వైఎస్సార్ లేని ఈ కాంగ్రెస్ కి బ్రహ్మరధం పట్టాలి కదా మరి.

కాంగ్రెస్ కి వ్యతిరేక ప్రచారం చెయ్యడమే పనిగా పెట్టుకొన్నందువల్ల , సాక్షి పై కొన్ని దాడులు చేసినా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చాలావరకు బెడిసికొట్టాయి. జలయజ్ఞం కు సంబంధించి ఇప్పటివరకు ఒక్కరినీ కదిలించకపోవడానికి కారణం, ఈ ప్రాజెక్టులు అన్నింటికీ ఉన్న ప్రజామోదం కాదా ?

ఇకముందు స్పీకర్ ఎవ్వరి రాజీనామాలు అంగీకరించేది లేదు అని ప్రకటించారు కాబట్టి, అవిశ్వాసం ప్రవేశపెట్టడం మినహా జగన్ మోహన్ రెడ్డి చెయ్యగలిగినదేమీ లేదు. ప్రజలు మాత్రం కాంగ్రెస్ అంటే ప్రస్తుతం జగన్మోహన రెడ్డి కే కనెక్ట్ అయి వున్నారు. కాబట్టి  రాబోయే రెండుసంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారి ని మరిపించేలా కాంగ్రెస్ పరిపాలన సాగిస్తే కొంతవరకు రాష్ట్రం లో  పార్టీ నిలబడుతుంది. 

అలాగే చంద్రబాబు అవినీతిని బయట పెట్టాలి అంటే, టి ది పి ప్రభుత్వం వల్ల దెబ్బతిన్న ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో నే ప్రయత్నించాలి. కాని అవ్వన్నీ Y S రాజశేఖర్ రెడ్డి గారు ఉపయోగించేసారు కదా. బయట పడితే జనానికి పనికొచ్చే స్కాములు బాబు ఖాతాలో ఎమున్నాయబ్బా ?  మీకు తెలుసా !!!

ఆరెంజ్: మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -2

ఆరెంజ్: మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -2

6, జూన్ 2012, బుధవారం

ఒక అబ్బాయి - ఒక అమ్మాయి - వేధింపుల పర్వం



ఆ అబ్బాయి ఎందుకు వేదిస్తున్నాడు రేణుక ను??? ఇదే అందరిని వేధిస్తున్న ప్రశ్న. మొదట సీనియర్  గా యెంతో అభిమానం గా సాయం చేసాడు, ఇప్పుడు బెదిరిస్తున్నాడు. అందరు చెప్పేది ఒకటే  మాములు గా చాలామంచి వాడు  స్టేట్ రాంకర్ కూడా. ఇంకెవరితోనూ అమర్యాదగా మాట్లాడిందే లేదు. రేణుక గురించి చెప్పాలంటే చదువుల సరస్వతి. అందరితో స్నేహం గా ఉండే తత్త్వం. సరదాకి కూడా ఎవరినీ నొప్పించదు తను. అతని తో సమస్యను వీలయినంత సామరస్యం గానే పరిష్కరించుకోవాలని ఆశ పడింది.

ప్రెషర్స్ పార్టి లో ఆ అమ్మాయి నాట్య ప్రదర్శన కు బోల్డన్ని ఫోటో లు తీసాడు. నెగెటివ్స్ తో సహా అడక్కుండానే తెచ్చి అమ్మాయికి ఇచ్చేసాడు. ఒక రోజు ఉన్నట్టుండి నెగెటివ్స్ కావాలని అడిగాడు. రేణుక ఇవ్వడం ఇష్టం లేకో , నిజం గానే కనిపించకో ఎక్కడో పెట్టేసాను లేవు అని సమాధానం చెపుతూ వచ్చింది. ఉహూ అతనికా సమాధానం నచ్చలేదు. అహం దెబ్బతిందో ఏమో ఆ అమ్మాయిని మాత్రమె బెదిరిస్తూ పోయాడు.పాపం అతన్ని వదిలించుకోవడానికి అని నిజం గానే వెతికింది ఫోటోలు , నెగెటివ్స్ కోసం  కాని దొరకలేదు. అక్కడే సమస్య మరింత జటిలం అయ్యింది.

కాలేజ్ మానేజ్మెంట్ కి పలు కంప్లైంట్స్ వెళ్ళాయి , అతన్ని హాస్టల్ నుండి కొన్నాళ్ళు తొలగించారు. ఆ అమ్మాయికి రక్షణ కావాలి అని అందరికి అర్ధం అయ్యింది. కాని సంవత్సరం పొడుగుతా రక్షణ ఇవ్వలేరు కదా. ఇంకా గట్టిగా అడిగితె అమ్మాయిని హాస్టల్ నుండి పంపేసినా దిక్కులేదు. మధ్యలో కొంచెం మారాడు అనుకొంటున్నారు. మిగిలిన అమ్మాయిలు కూడా అప్పుడప్పుడు రిక్వెస్ట్ చేసేవారు తనని ఏమి చెయ్యొద్దు అని, విని నవ్వేసి వెళ్ళిపోయేవాడు.


అసలు వాళ్ళిద్దరి పరిచయమే పెద్దవారి ద్వార జరిగింది. అమ్మాయి కాలేజ్ లో జాయిన్ అయ్యేసమయం లో , తమ ప్రాంతం అనో ఒకే ఊరు అనో తెలిసి సీనియర్ అయిన ఆ  అబ్బాయి ని కలిసి , అమ్మాయి తల్లి  'చెల్లె ని' బాగా చూసుకో నాయనా అని బోల్డంత బాధ్యత అబ్బాయికి అప్పగించేరన్న మాట. కాని ఇపుడు అమ్మాయిని బాధ పెడుతున్నాడు అని తెలిసి అబ్బాయి తల్లిదండ్రులకు అమ్మాయి తరపువారు  సమస్య చెప్పారు. మేము చెప్పగలిగినది చెప్పాం అని, ఇంకా తాము కొడుకు కి పలుమార్లు చెప్పి విసిగిపోయామని  వదిలేశామని వారు చేతులెత్తేశారు !!!

 ఫైనల్ ఎగ్జామ్స్ జరిగే వేళ ఒకరోజు తాపిగా పరీక్షా వ్రాసి , అమ్మాయి మెస్ నుండి బయటికి వచ్చే టైం లో గేటు దగ్గర కాపలా కాసి వెంట పడ్డాడు. పదునైన కత్తి(బ్లేడు ?)  తో మొహం నిండా, ఇంకా చేతి మణి కట్టు దగ్గరా కసితీరా గాయ పరిచాడు. ఆ  అమ్మాయి అందం గా కనిపించ కూడదని మొహం పై పాశవికం గా దాడిచేసాడు. చెయ్యి అడ్డుపెట్టడం తో మణికట్టు దగ్గర నరం తెగి రక్తం ధార కట్టింది . కళ్ళు మూసి తెరిచేంత లో పరారు అయ్యాడు.  గబా గబా తనని హాస్పిటల్ కి తీసికొనే వెళ్ళడమే కాక ప్రిన్సిపాల్ కి మరియు పేరెంట్స్ కి కూడా సంఘటన గురించి తెలియపరచడం జరిగాయి. విద్యార్ధినీ విద్యార్దులు అందరు రేణుకకు మద్దతు గా నిలిచారు. చాలా రక్తం పోయింది కాని, గండం గట్టెక్కినట్లే. వాళ్ళ ఒక్క బాచ్ కి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి.

 పోలీసులు అతని కోసం వెతకడం మొదలుపెట్టారు. నాలుగు రోజులకి ఎమ్మెల్యేని వెంట బెట్టుకొని వచ్చి పోలీసుల ముందు తనే లొంగిపోయాడు. ఒక ఫోటో ఆమ్మయితో కలిసి ఉన్నది చూపి , నాతొ ఆ అమ్మాయి తిరిగినది అని అభియోగం మోపాడు. అప్పటి దాకా అమ్మాయికి అండగా నిలిచినా తండ్రి , ఆ పిల్లని తిట్టిపోయ్యడం మొదలుపెట్టారు. ఆయనకీ తెలుసు అది అంత అబద్దం అని , కాని ఫోటో దిగి చెప్పలేదు అని బాగా కోపం తెచ్చు కొన్నారు .


నిజానికి ఒక సెలవురోజు అమ్మాయి తన మిత్ర బృందం తో ఫోటో లు తీసికొంటూ ఉండగా, అటుగా వెళ్తున్న ఈ అబ్బాయి నాతొ కూడా ఫోటో అని మొహమాట పెట్టి  తన ప్రక్క నిలుచున్నాడు . అందరు అన్నయ్య అని పిలుస్తారు కదా, అందునా సీనియర్ కాబట్టి వద్దు అని ధైర్యము చెయ్యలేదు, అలాగని అనుమానమూ లేదు. అదన్నమాట ఫోటో వెనుక కధ. అసలా సంగతే మర్చిపోయారు. కాని తండ్రి అర్ధం చేసుకొంటే కదా. ఆయనకీ కూతురు అమాయకత్వం కన్నా, కేసు నీరుకారిపోతున్నదన్న బాదే ఎక్కువయ్యిందా, ఏం చేస్తాం.

బెయిల్ పై బయటికి వచ్చి సాక్షులు  గా ఉన్న ఆ అమ్మాయి సహ విద్యర్దినులను అందరినీ  కత్తి తో బెదిరించి  వెళ్ళాడు .నిజానికి ప్రత్యక్ష సాక్షి గా ఉన్న  రేణుక కు రూం మేటు ఒక అమ్మాయి , ముందే తను మాత్రం సాక్ష్యం చెప్పేది లేదు అని నిర్ణయించుకొంది, కెరీర్ కి ట్రబుల్ రావోచ్చును అని.  ప్రిన్సిపాల్ కూడా కొన్ని అనివార్య కారణాలు, స్వప్రయోజనాలు కూడా దృష్టి లో ఉంచుకొని విచారణ కి దూరం గా ఉన్నారు. ఇంకా మిగిలిన వారిలో వేరే బ్రాంచ్ కి చెందిన ఒకమ్మాయి ( పేరు స్వాతి ) మాత్రం మనస్సాక్షి ముఖ్యం అని సాయం చెయ్యడానికి ముందుకు వచ్చినా తన స్నేహితులు  ఒట్టు పెట్టిన్చుకొన్నారు, అబ్బాయి చంపేస్తాడు అన్న భయం తో . సాక్ష్యం చెప్పనివ్వని మిత్రులపై కూడా అలిగి తానూ మౌనాన్ని ఆశ్రయించింది.



అప్పటికీ అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటే, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ఆ అబ్బాయి, ఆ ఫోటో ని ఆధారం గా చూపడం మోసం కాదా అని. సమాధానం ఇంకో అమ్మాయి ఇందు ద్వార వెలుగులోకి వచ్చింది. తనతో ఉన్నట్టుండి ఒకసారి ఆ అబ్బాయి ఒక మాట చెప్పాడు , పెద్ద వాళ్ళు తను చెల్లి వరుస అవుతుంది అని మొదట చెప్పారు కాని ఇంకో వరుసలో మరదలు అవుతుందని అతనికి తెలిసింది అని . ఇందు ఆ విషయం అప్పుడే వదిలేసింది పొడిగించడం సభ్యత కాదు కాబట్టి. హ్మ్ అలా  అతను రేణుకను ప్రేమించాడు, వ్యక్త పరిచడానికి వీలు లేదు అన్నయ్య గా పరిచయం అయ్యాడు కాబట్టి. అలాగని తనలో తాను దాచుకోలేక, మణిరత్నం సినిమా లో విలన్ గా మారిపోయాడు .



తర్వాతి సంవత్సరం మొదలయ్యింది. కేసు చాలా మలుపులు తీసికొంది. అబ్బాయి తల్లి దండ్రులకి కడుపు తీపి గుర్తుకొచ్చింది, అమ్మాయి కాళ్ళా వేళ్ళ పడ్డారు  కేసు వెనక్కి తీసికొమ్మని, ఇద్దరికీ పెళ్లి ఒక పరిష్కారం గా కూడా సూచించారు. ప్రాణహాని గురించి  చెప్పి కాదంటే వ్రాయడానికి వీలు కానన్ని తిట్లు శాపనార్ధాలు పెట్టారు. సాక్ష్యము ఇవ్వాలని ఉన్న స్వాతి  కి మిత్ర బృందం చివరికి తామంతా రక్షణ గా ఉంటాము ఏదయితే అది అవుతుంది అని ఆమెని సాక్ష్యం ఇవ్వడానికి అనుమతించారు  . ప్రత్యక్ష సాక్షి అయిన అమ్మాయిని మాత్రం ఎవరు బలవంత పెట్టలేదు. ఈ లోగా ఆ అబ్బాయి తన బెదిరింపుల పర్వం లో ప్రిన్సిపాల్ ని కూడా  ఈ కేసు లో ఇన్వాల్వ్ అయితే చంపేస్తా అని  బెదిరించేసరికి  ఆయన అహం బోల్డంత దెబ్బతినేసింది .ఇంకేం ఆయన తను చెప్పాల్సింది కోర్టు లో న్యాయమూర్తి ఎదుట చెప్పేశారు, మిగిలిన సాక్ష్యాలు అన్ని కూడా విన్న జడ్జి అతనికి పదేళ్ళు జైలు శిక్ష విధించాడు.

ఇంకో మూడు సంవత్సరాలు గడిచాయి, ఇన్ని సమస్యలను దాటి రేణుక చదువు అయిపోయింది . ఒక కాలేజి లో లెక్చరర్ గా ఉద్యోగం లో చేరింది. తను నేను ఇపుడు బాగానే ఉన్నాను , అతని భవిష్యత్తు పాడయిపోతున్నది అని కేసు వాపస్ తీసికొని అతని విడుదల అయ్యేలా చూసింది అని తెలిసి చాలా సంతోషం వేసింది. అంత మంచి అమ్మాయి రేణుక.

అబ్బాయి కూడా మంచి వాడే. కాని మన వ్యవస్థ లో ఈ పెద్ద వాళ్ళు అమ్మాయి కి అదే కాలేజి లో చదువుతున్న అబ్బాయి రక్షణ అని వాళ్ళిష్టం వచ్చినట్లు పరిచయం చెయ్యడం, పదే పదే ఇంటికి పిలిచి భోజనం పెట్టి చెల్లె జాగ్రత్త అని చెప్పడం కూడా స్వార్ధం తో కూడిన  సామాజిక పొరపాటు అని నా అభిప్రాయం . అమ్మాయి కి తన వ్యక్తిత్వమే తనకు సాయం  కావాలి అని ఈ పెద్దవాళ్ళకి ఎప్పుడు అర్ధం అవుతుంది.  ఇక రేణుక లాంటి అమ్మాయిలు పెద్దవాళ్ళ పిరికితనం, అభద్రతా భావం తమని, తమ స్నేహాల్ని ప్రభావితం చెయ్యకుండా చూసుకోవాలి.

ఆడపిల్లల పై దాడి జరిగిన చాలా సంఘటనల్లో అబ్బాయిలని మాత్రమె బాధ్యులని చెయ్యకుండా , అమ్మాయిలు వీలయినంత వరకు తమ తమ పరిచయాలను పునః పరిశీలన చేసుకొనే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఎవరి రక్షణ కు వారే మొదటి బాధ్యత వహించాలి.

 ఒక అబ్బాయి  , లేదా అమ్మాయి ని 'సెలెక్టివ్' గా అన్న, చెల్లి ,అక్క  లేదా తమ్ముడు అని వ్యవహరించాల్సిన ఖర్మ తెలుగువాళ్ళకే నేమో . ఇది నవీన కాలపు సామజిక దురాచరమా అని అనుమానం వస్తుంది.